వైసిపి నేత హత్య కేసులో  మాజీ మంత్రి రవీంద్ర 

టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అరెస్ట్ చేయడం కోసం మచిలీపట్టణం పోలీసులు గాలిస్తున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మచిలీపట్టణం మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్‌ మోకా భాస్కరరావు హత్య కేసులో నమోదు చేసిన కేసులో నిందితుడిగా పేర్కొనడంతో తిరుగుతున్నారు.
హత్యకేసులో పట్టుబడ్డ నిందితుల వాంగ్మూలంతో సూత్రదారుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఈ  హత్యలో కొల్లు రవీంద్ర ప్రమేయం ఉందన్న ఆరోపణలో నేపథ్యంలో పోలీసులు ఆయన ఇంటికి చేరుకోగా విషయం తెలుసుకుని ఆయన పరారైనట్టు చెబుతున్నారు.
 రాజకీయంగా, సామాజికంగా మోకా ఎదుగుదలను చూసి ఓర్వలేని ప్రత్యర్థులు (టీడీపీ నాయకులు) ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు దర్యాప్తులో తేలిన్నట్లు పోలీసులు తెలిపారు.  మోకా భాస్కరరావు (57) బందరు నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)కి ముఖ్య అనుచరుడిగా, నమ్మకస్తుడిగా ఉంటున్నాడు.
భాస్కరరావు నాలుగు రోజులుగా చేపలమార్కెట్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు వస్తుండటం గమనించిన ప్రత్యర్ధులు  గత నెల 29వ తేదీన మోకా హత్యకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు.
మోకా భాస్కరరావు హత్యకేసులో చింతా చిన్నీ ప్రధాన నిందితుడు కాగా చింతా నాంచారయ్య (పులి), చింతా కిషోర్‌లను గురువారం ఆర్‌పేట పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్‌ చేశారు. ఇదిలా ఉండగా భాస్కరరావు హత్య మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రోద్భలంతోనే జరిగిందంటూ కుటుంబసభ్యులు ఆరోపించటంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో చింతా చిన్నీ, నాంచారయ్య, కిషోర్‌లతో పాటు మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై ఆర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ మహబూబ్‌బాషా తెలిపారు. కాగా, ఈ హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేరు చేర్చడంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర  అభ్యంతరం తెలిపారు. 
 
టిడిపి మాజీ మంత్రి అచ్చంనాయుడు ఇఎస్ఐ కుంభకోణంలో ఎసిబి అరెస్ట్ లో ఉండగా, మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, మాజీ ఉపముఖ్యమంత్రి చిన్నరాజప్పలపై  ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. మరో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుపై నిర్భయ కేసు నమోదు చేశారు.  కావడం గమనార్హం.