28 మందితో ఎంపీ మంత్రివర్గం విస్తరణ 

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ తన మంత్రిమండలిని విస్తరించారు.  భోపాల్‌లో ఈ రోజు ఉదయం 28 మందితో గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు.  అందులో 20 మంది మంత్రులుగా, ఎనిమిది మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. మంత్రిమండలి విస్తరణ అంశం గత మూడు నెలలుగా వాయిదాపడుతూ వస్తున్నది.

మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత, మార్చి నెలలో సీఎంగా శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ బాధ్యతలు చేపట్టారు. నెల రోజుల తర్వాత మంత్రిమండలిలోకి ఐదుగురిని తీసుకున్నారు.

రాజ్యసభ ఎన్నికలతోపాటు, కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింథియాతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఎవరెవరికి మంత్రిమండలిలో చోటుకల్పించాలనే అంశంపై స్పష్టత లేకపోవడంతో మంత్రివర్గ‌ విస్తరణ ఇన్నిరోజులుగా వాయిదాపడుతూ వస్తున్నది.

ఈరోజు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినవారిలో జ్యోతిరాదిత్య సింథియా విధేయులతోపాటు, ఆయన అత్తమ్మ, బీజేపీ ఎమ్మెల్యే అయిన యశోధర రాజె సింథియా కూడా ఉన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన మంత్రులకు సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ శుభాకాంక్షలు తెలుపుతూ “మధ్యప్రదేశ్‌ ప్రజల సంక్షేమం కోసం మనమంతా కలిసి పనిచేద్దాం. కొత్త మార్పులు తీసుకొచ్చేందుకు నేను మీ అందరికీ మద్దతు ఇస్తాను” అంటూ ట్వీట్‌ చేశారు