రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స!  

రోడ్డు ప్రమాద బాధితులకు చికిత్సకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. బాధితులకు నగదు రహిత చికిత్స అందించే పథకానికి రూపకల్పన చేసినట్లు వెల్లడించింది. ఈ పథకం కింద ఒక్కో వ్యక్తి/యాక్సిడెంట్‌కు రూ.2.5 లక్షల బీమా కవరేజీ కల్పిస్తారు.

ఈ మేరకు అన్ని రాష్ట్రాల రవాణా కార్యదర్శులు, కమిషనర్లకు కేంద్రం సమాచారం అందించింది. దీనిపై తమ అభిప్రాయాలను ఈ నెల 10లోగా తెలియజేయాలని కోరింది. దేశంలో ఏటా సగటున 5 లక్షల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తుండగా, 1.5 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోతున్నారు.

మోటార్‌ వాహనాల చట్టం-2019లో పేర్కొన్నట్లుగా కేంద్ర రవాణా శాఖ ఈ పథకానికి బ్లూప్రింట్‌ సిద్ధం చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. కీలకమైన గోల్డెన్‌ అవర్‌లో (ప్రమాదం జరిగిన తొలి గంట) చికిత్స అందించడం కూడా ఈ పథకం కిందకు వస్తుందని పేర్కొంది.

సత్వర చికిత్సే లక్ష్యం

  • ఈ స్కీమ్‌ కింద మోటార్‌ వెహికల్‌ యాక్సిడెంట్‌ ఫండ్‌  ఏర్పాటుచేస్తారు. బాధితుల చికిత్సకు, వారి కుటుంబాలకు పరిహారం అందించేందుకు దీనిని వినియోగిస్తారు.
  • ఆయుష్మాన్‌ భారత్‌కు నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న నేషనల్‌ హెల్త్‌ అథారిటీ పథకం అమలును పర్యవేక్షిస్తుంది.
  • భీమాలేని వాహనాల ప్రమాదాలకు ప్రభుత్వమే చెల్లిస్తుంది. అయితే ఆ వాహనాల యజమానులు చికిత్సకు అయ్యే మొత్తాన్ని పరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది.