చైనా సరిహద్దు వివాదంపై తమది బీజేపీ విధానమే 

భారత్‌ – చైనా సరిహద్దు వివాదంపై తమదని బీజేపీ విధానమే అని బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి, యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి స్పష్టం చేశారు. సరిహద్దు వివాదంపై కాంగ్రెస్‌, బీజేపీ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని, ఇది ఆందోళన కలిగించే అంశమని  ఆమెపేర్కొన్నారు.
వెనుకబడిన తరగతుల ప్రజలు, ఆదివాసీలు, మైనారిటీల కోసమే బీఎస్పీ ఆవిర్భవించిందని పేర్కొంటూ పార్టీ ఏర్పడినప్పుడు కాంగ్రెస్‌ అధికారంలో ఉందని, ఆయా వర్గాల ప్రజల ప్రయోజనాల కోసం ఏదైనా చేసి ఉంటే బీఎస్పీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండేది కాదని ఆమె పేర్కొన్నారు.
బీఎస్పీ ఎవరి చేతులో బొమ్మ కాదని బీజేపీ, కాంగ్రెస్‌లకు స్పష్టం చేస్తూ ఇది జాతీయ స్థాయిలో ఏర్పడిన స్వతంత్ర పార్టీ అని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్‌పై దాడిని కొనసాగిస్తూ కరోనా వైరస్‌ సంక్రమణ క్రమంలో తమ స్వరాష్ట్రానికి తిరిగి వచ్చిన వలసదారులు కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాలకు వెళ్లారని గుర్తు చేశారు.
కాంగ్రెస్‌ వారికి ఏదైనా చేసి ఉంటే వారు ఉపాధి కోసం వివిధ రాష్ట్రాలకు వెళ్లి ఉండేవారు కాదని ఆమె విమర్శించారు. బీజేపీ వాటిని పునరావృతం చేయొద్దని ఆమె సూచించారు. దేశాన్ని ‘ఆత్మ నిర్భర్‌’గా చేయడానికి కష్టపడాలని, ప్రచారం పెద్దగా చేయొద్దని మాయావతి హితవు చెప్పారు. అలాగే దేశంలో ఇంధన ధరల పెంపును నియంత్రించాలని కేంద్రాన్ని కోరారు