‘నమామీ గంగే’కు ప్రపంచ బ్యాంకు సహాయం 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘నమామీ గంగే’ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు అర్థిక సాయం అందించేందుకు అంగీకరించింది. జాతీయ గంగా రివర్ బేసిన్ ప్రాజెక్ట్ కింద గంగా నది వెంబడి ప్రాజెక్టుల మౌలిక సదుపాయాల అభివృద్ధికి 600 మిలియన్ డాలర్ల నిధులను కేటాయించనుంది. 

మొత్తం గంగా బేసిన్‌లో కాలుష్యాన్ని తగ్గించేందుకుగానూ గంగా నది  ఉపనదులపై ప్రాజెక్టులను చేపట్టేందుకు గంగా నది బేసిన్ ప్రాజెక్ట్ కింద 400 మిలియన్ డాలర్లు అవసరమని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.  

కాగా, తాజాగా ప్రపంచ బ్యాంక్ బృందం, నేషనల్ మిషన్ ఆఫ్ క్లీన్ గంగా (ఎన్‌ఎంసీజీ) మధ్య చర్చలు జరిగాయి. ఇందులో రెండో జాతీయ గంగా రివర్ బేసిన్ ప్రాజెక్ట్ భాగాలపై గంగా -ఐ నుంచి స్పిల్‌ఓవర్ ప్రాజెక్టులు, యమునా, కాశీలాంటి ముఖ్యమైన ఉపనదులపై చేపట్టబోయే ప్రాజెక్టులపై చర్చించారు.  ప్రపంచ బ్యాంకు ఇచ్చే రుణం డిసెంబర్ 2026 వరకు ఐదేళ్ల కాలానికి ఉంటుంది. 

రెండు భాగాలుగా ఈ రుణాన్ని విభజించారు. 381 మిలియన్ డాలర్ల రుణం, చెల్లింపు భద్రత కింద 19 మిలియన్ డాలర్ల వరకు హామీ ఇవ్వనుంది. అలాగే, గంగానది ఉపనదులపై ఆగ్రా, మీరట్ , సహారన్పూర్లలో మూడు కొత్త హైబ్రిడ్ యాన్యుటీ ప్రాజెక్టులకు 150 మిలియన్ డాలర్లు అందించనుంది.