ఆగస్టు 12 వరకు రైళ్ల నిలిపివేత

దేశంలో ఆగస్టు 12వ తేదీ వరకూ రెగ్యులర్ రైళ్ల రాకపోకల రద్దు కొనసాగుతుంది. ఇప్పుడు నడుస్తున్న ప్రత్యేక రైళ్లు యధావిధిగా నిర్వహిస్తారని రైల్వే బోర్డు తెలిపింది. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా 230 ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. అయితే సాధారణ సమయాలలో నడిచే ప్రయాణికుల రైళ్లు అంటే మెయిల్ /ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ప్యాసింజర్, సబర్బన్ రైళ్లను ఆగస్టు 12వ తేదీ వరకూ నిలిపివేస్తున్నట్లు రైల్వేబోర్డు ప్రకటించింది. 

జులై 1 నుంచి 12 ఆగస్టు వరకూ రెగ్యులర్ రైళ్లకు రిజర్వ్ అయిన టికెట్లు రద్దు అవుతాయి. ఈ మొత్తాన్ని ప్రయాణికులకు తిరిగి చెల్లిస్తారు. దేశంలో అత్యధిక సంఖ్యలో ప్రజల రవాణాకు ఉపయోగపడే భారతీయ రైల్వే సామూహిక జన ప్రయాణానికి రైళ్లు ఉపయోగపడుతూ వస్తున్నాయి. అయితే మార్చి 25వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా రైళ్లు నిలిపివేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ఇది అత్యంత కీలకమని భావించారు.

ఎప్రిల్ 15వ తేదీ నుంచి రెగ్యులర్ రైళ్లకు అడ్వాన్స్ బుకింగ్‌ను నిలిపివేసింది. ఈ దశలో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తమకు సరైన సౌకర్యంలేకపోవడంతో నానా ఇబ్బందులకు గురవుతూ వస్తున్నారు. పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వైరస్ నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లతో తొలుత 30 రాజధాని తరహా ఎసి రైళ్లను ప్రారంభించారు.

జూన్ 1వ తేదీన రైల్వే 200 అదనపు రైళ్లను ప్రారంభించింది. లాక్‌డౌన్ దశలో చేపట్టిన ప్రత్యేక రైళ్లు ఉంటాయని రైల్వే బోర్డు తెలిపింది. మెట్రో రైళ్లు కూడా ఇప్పటికిప్పుడు పునరుద్ధరించేది లేదని వెల్లడైంది.