హైదరాబాద్ లో వర్తకులు స్వచ్ఛందంగా లాక్ డౌన్ 

కరోనా కట్టడి పట్ల తెలంగాణ ప్రభుత్వం తీసుకొంటున్న చర్యల పట్ల వర్తకులు నమ్మకం కోల్పోయిన్నతున్నారు. అందుకనే తమను తాము కాపాడుకోవడానికి హైదరాబాద్ లో పలు రద్దీగా ఉండే మార్కెట్ ప్రదేశాలలో స్వచ్ఛందంగా లాక్ డౌన్ ప్రకటించుకొంటున్నారు. 
 
లాక్ డౌన్ ను సడలించినప్పటి నుండి హైదరాబాద్ లో కరోనా కేసులు పలు రేట్లు పెరుగుతూ ఉండడం, తెలంగాణలో మొత్తం కేసులు ఇప్పుడు 11,000 పైకి పెరగడం, వాటిల్లో మూడొంతులు పైగా హైదరాబాద్ నగరంలోనే ఉండడంతో వారు భయపడుతున్నారు. పైగా ఎక్కడా సాంఘిక దూరం పాటించడం లేదు. మాస్క్ లు ధరించడం లేదు. అటువంటి వారిని నియంత్రించే ప్రయత్నం జరగడం లేదు. 
 
తెలంగాణలో గురువారం ఒక్క రోజే 920 పాజిటివ్‌లు తేలడం ఉలిక్కిపాటుకి గురిచేసింది. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 737, జిల్లాల్లో 183 మందికి కోవిడ్ సోకింది.దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 11364 కి చేరగా, ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 230 కి పెరిగింది. 
 
ఇప్పటికే సికింద్రాబాద్‌లోని బనారస్‌ పట్టు చీరల మార్కెట్‌ను బంద్‌ చేయగా, ఈ నెల 28 నుంచి జూలై 5 వరకు బేగంబజార్‌ మార్కెట్‌ను పూర్తిస్థాయిలో మూసివేస్తున్నట్లు వ్యాపారులు ప్రకటించారు. ఈ శుక్రవారం నుంచి వచ్చే శుక్రవారం వరకు లాడ్‌ బజార్‌ను బంద్‌ చేస్తున్నట్లు లాడ్‌ బజార్‌ ట్రేడ్‌ యూనియన్‌ వ్యాపారులు తెలిపారు.
 
26వ తేదీ నుంచి జూలై 5 వరకు సికింద్రాబాద్‌ జనరల్‌ బజార్‌, సూర్యా టవర్స్‌, ప్యారడైజ్‌ ప్రాంతాల్లో అన్నీ దుకాణాలు మూసివేయనున్నారు. ఈ శుక్రవారం నుంచి జూలై 5 వరకు బంగారం దుకాణాల స్వీయ లాక్‌డౌన్‌ పాటించనున్నామని సికింద్రాబాద్‌ గోల్డ్‌, సిల్వర్‌ జువెలరీ, డైమండ్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. 
 
తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ఎలక్ర్టికల్‌ మార్కెట్‌గా ఉన్న ట్రూప్‌ బజార్‌ను వచ్చే ఆదివారం నుంచి స్వచ్ఛందంగా బంద్‌ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత ఈ మార్కెట్లలో జనాల రద్దీ బాగా పెరిగింది. పలువురు వ్యాపారులకు కరోనా వైరస్‌ సోకింది. 
 
ఈ క్రమంలోనే బేగంబజార్‌, ఫిల్‌ఖానా, సిద్ది అంబర్‌ బజార్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం 2 గంటల వరకు మాత్రమే  దుకాణాలను   తెరుస్తున్నారు.  దుకాణాలకు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉన్నందున వీటిని స్వచ్చంధంగా మూసివేస్తున్నామని వ్యాపారులు పేర్కొన్నారు