ప్రపంచంలో కోటికి చేరువలో కరోనా కేసులు 

కరోనా విజృంభణతో ప్రపంచంలో కరోనా  కేసులు కోటికి చేరువవుతుండటం శాస్త్రవేత్తలను, ప్రభుత్వాలను కలవరపెడుతున్నది. మరణాలు ఐదు లక్షలకు చేరువగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా గురువారంనాటికి 9,630,127 కేసులు నమోదుగా, 487,473 మంది  మరణించారు. 5,232,083 మంది కోలుకున్నారు.
కొంతకాలంగా అమెరికాలో తగ్గుముఖం పడుతున్నట్టు కనిపించిన ఉద్ధృతి మళ్లీ పెరుగుతున్నది. బ్రెజిల్‌లో రోజువారీ కేసులు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. భారత్‌లో కరోనా తీవ్రత అంతకంతకూ పెరుగుతున్నది. రష్యా, బ్రిటన్‌లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకూ నమోదైన మొత్తం కేసుల్లో సగానికిపైగా కేసులు, 52 శాతానికి పైగా మరణాలకు ఈ ఐదు దేశాలే కేంద్రంగా ఉన్నాయి. 
గత ఏప్రిల్‌లో నెలకొన్న కొవిడ్‌-19 భయానక పరిస్థితులు అమెరికాలో పునరావృతమవుతున్నాయి. బుధవారం ఒక్కరోజే 38,386 కేసులు నమోదయ్యాయి. అమెరికాలో అక్టోబర్‌ 1 నాటికి కరోనా మరణాలు 1.80 లక్షలకు చేరుకోవచ్చని యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ అంచనా వేసింది.  బ్రెజిల్‌లో గురువారం నాటికి 12,07,721 మంది వైరస్‌ బారిన పడ్డారు. 54,434 మంది మరణించారు. బుధవారం ఒక్కరోజే అత్యధికంగా 40,995 కేసులు నమోదయ్యాయి.
భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాలుస్తున్నది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు గడిచిన 24 గంటల్లో 16,922 కొత్త కేసులు, 418 మరణాలు నమోదయ్యాయి. ఒక్కరోజు కేసుల్లో ఇదే అత్యధికం. దీంతో మొత్తం కేసులు 4,73,105కు చేరుకున్నాయి. మొత్తం మరణాలు 14,894గా రికార్డు అయ్యాయి.
కాగా, భారత్‌లో కరోనా వైరస్‌ రెండోసారి దాడిచేసే ప్రమాదం ఉందని ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా హెచ్చరించారు. కరోనా తగ్గుముఖం పట్టిన ప్రాంతా ల్లో కూడా రెండోసారి వైరస్‌ విజృంభించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. కరోనా తగ్గిన ప్రాంతాల్లో నిర్లక్ష్యం వహిస్తే సమస్య తిరగబెడుతుందని హెచ్చరించారు.
చైనా, దక్షిణ కొరియాలలో రెండో దశ వైరస్‌ దాడి ప్రారంభమైందని తెలిపారు. కొవిడ్‌-19 కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పరిమిత స్థాయిలో లాక్‌డౌన్‌ అమలుచేయటం అవసరమని స్పష్టం చేశారు.