ఇస్లామాబాద్‌లో శ్రీ కృష్ణ మందిరం 

పాకిస్తాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో మొట్టమొదటి హిందూ దేవాలయ నిర్మాణ ప్రక్రియకు బీజం పడింది. రూ.10 కోట్ల వ్యయంతో ఇస్లామాబాద్‌లోని హెచ్-9 ప్రాంతంలో శ్రీకృష్ణ మందిర నిర్మాణానికి పాకిస్తాన్ మానవ హక్కుల పార్లమెంటరీ కమిటీ కార్యదర్శి చంద్ మాల్హి శంకుస్థాపన చేశారు. 

20,000 చదరపు అడుగులలో ఈ కృష్ణ మందిర నిర్మాణం జరగనున్నది. ఇస్లామాబాద్‌తోపాటు పరిసర ప్రాంతాలలో 1947 పూర్వపు హిందూ ఆలయాల కట్టడాలు ఉన్నాయని ఈ సందర్భంగా మాల్హి  చెప్పారు. వీటిలో రావల్ సరస్సు సమీపంలోని కోరంగ్ నదికి అభిముఖంగా కొండపై వెలసిన ఆలయం కూడా ఉండేదని ఆయన చెప్పారు.

అయితే, ఈ ఆలయాలు భక్తుల రాక లేని కారణంగా నిరుపయోగంగా మారిపోయాయని ఆయన తెలిపారు. గడచిన రెండు దశాబ్దాలలో ఇస్లామాబాద్‌లో హిందువుల జనాభా గణనీయంగా పెరిగిందని, వారి కోసమే ఆలయ నిర్మాణ ఆవశ్యకత ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు.

అంతేగాక ఇస్లామాబాద్‌లో హిందువులకు ప్రత్యేక స్మశాన వాటిక లేకపోవడం పట్ల కూడా మాల్హి ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకృష్ణ మందిర నిర్మాణానికి అయ్యే రూ. 10 కోట్ల అంచనా వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుందని మతపరమైన వ్యవహారాల మంత్రి పీర్ నూరుల్ హఖ్ ఖాద్రీ తెలిపారు.

ఇందు కోసం ప్రత్యేక గ్రాంటును విడుదల చేయాలని కోరుతూ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మంత్రి ఒక నివేదిక కూడా సమర్పించారని డాన్ పత్రిక తెలిపింది. ఈ ఆలయానికి శ్రీ కృష్ణ మందిర్ అని ఇస్లామాబాద్ హిందూ పంచాయత్ నామకరణం చేసింది. 

ఆలయ నిర్మాణం కోసం 2017లోనే రాజధాని అభివృద్ధి సంస్థ (సిడిఎ) హిందూ పంచాయత్‌కు స్థలాన్ని కేటాయించింది. అయితే ఆలయ స్థలానికి సంబంధించిన మ్యాపు, పత్రాలు వంటివి సిడిఎ నుంచి రావడం ఆలస్యం కావడంతో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. ఈ ఆలయ సముదాయంలోనే ఇతర హిందూ దేవతల ఆలయాలతోపాటు విడిగా స్మశాన వాటిక కూడా ఉంటుంది.