ఆర్బీఐ పరిధిలోకి సహకార బ్యాంకులు

సహకార బ్యాంకులన్నింటిని ఆర్బీఐ పరిధిలోకి తీసుకొస్తున్నట్లు కేంద్రం ఆర్డినెన్స్ జారీచేసింది. ఈ ఆర్డినెన్స్ కు కేంద్ర కేబినెట్ ఆమెదం తెలిపింది. 

దేశవ్యాప్తంగా ఉన్న 1482 సహకార బ్యాంకులు మరియు 58 మల్టీ స్టేట్ సహకార బ్యాంకులన్ని కలిపి 1540 బ్యాంకులను ఆర్బీఐ పరిధిలోకి తీసుకొస్తున్నట్లు కేబినేట్ నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

ఆర్బీఐ పరిధిలోకి తేవడం వల్ల ఆ బ్యాంకుల్లోని 8.6 కోట్ల మంది ఖాతాదారులకు సొమ్ముకు భద్రత కల్పించినట్టు అవుతుందని పేర్కొన్నారు.  బ్యాంకింగ్ రంగంలో పలు సంస్కరణలు తీసుకొచ్చినట్లు కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. దేశంలో అర్బన్ బ్యాంకుల సంఖ్య భారీగా పెరిగిందని ఆయన చెప్పారు.

మరోవైపు పాస్‌పోర్ట్‌ జారీ ప్రక్రియ మరింత సులభతరం కానుందని మంత్రి చెప్పారు. ధ్రువీకరణ పత్రాల జాబితాను కుదించినట్టు తెలిపారు. పాస్‌పోర్ట్‌ జారీలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, హరియాణా ముందంజలో ఉన్నాయని వెల్లడించారు.

ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్ ఎయిర్‌పోర్టు అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్పు చేయాలని, అంతరిక్ష రంగంలో ప్రైవేటు పెట్టుబడులకు అనుమతి ఇవ్వలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది. ఓబీసీ కులాల వర్గీకరణ కమిటీ గడువు మరో 6 నెలలు పొడిగించాలని నిర్ణయించి, జనవరి 31, 2021 కల్లా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పశుసంవర్ధక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.