పన్నుల ఎగవేతదారులపై ఏపీ నిఘా 

పన్నుల ఎగవేతను నిరోధించేందుకు, ఆర్ధిక అంశాలను మెరుగుపరిచేందుకు కొత్తగా ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటలిజెన్స్‌ (ఎపిఎస్‌డిఆర్‌ఐ)ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఆర్ధిక శాఖలో భాగంగా పనిచేసే ఈ శాఖలో 55 మంది ఉద్యోగులు, అధికారులను నియమించనున్నారు. 
 
ఇప్పటివరకు కేంద్రంలో, రాజస్థాన్‌ వంటి కొన్ని రాష్ట్రాల్లో ఉన్న రెవెన్యూ ఇంటలిజెన్స్‌ ఇకపై రాష్ట్రంలో కూడా కీలక పాత్ర పోషించనుంది. దీనికి కమిషనర్‌ లేదా స్పెషల్‌ కమిషనర్‌ అధిపతిగా ఉంటారు. మిగిలిన అధికారులు, సిబ్బందిని డిప్యుటేషన్‌ విధానంలో నియమించాలని నిర్ణయించారు. 
 
శాఖ విధుల కోసం రాష్ట్రంలోని ఒక కీలక ప్రాంతాన్ని గుర్తించాలని, మూడు నాలుగు ప్రాంతీయ కార్యాలయాలను కూడా ఏర్పాటుచేయనున్నారు. పన్నులు చెల్లించని వారిపై కేసులు నమోదుచేయడం, పన్నులు సక్రమంగా ఖజానాకు చేరేలా చూడడం, ఎప్పటికప్పుడు వస్తున్న పన్నులను అధ్యయనం చేసి తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సులు చేయడం ఈ శాఖ విధులుగా ఉంటాయి. 
 
కాగ్‌ అభ్యంతరాలను కూడా పరిష్కరించేందుకు, లొసుగులను నివారించేందుకు డిఆర్‌ఐ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 15 చట్టాలకు సంబంధించిన అంశాలపైనా డిఆర్‌ఐ దృష్టి సారించాల్సి ఉంటుంది. 
 
ఈ శాఖ నిర్వహించాల్సిన విధుల్లో ఇంటెలిజెన్స్‌, కేసులు, రహస్య సమాచార సేకరణ వంటి అంశాలు ఉండడం వల్ల అందులో పనిచేసే ఉద్యోగులకు అదనంగా 25 శాతం అలవెన్సును చెల్లించాలని నిర్ణయించారు. సమాచారం ఇచ్చేవారిని ప్రోత్సహిరంచేందుకు సీక్రెట్‌ సర్వీసు ఫండ్‌ను కూడా ఏర్పాటుచేయాలని నిర్ణయించారు.