కాంగ్రెస్ వేధింపులతో‌నే ఆరోగ్యం దెబ్బతింది 

కాంగ్రెస్ ప్ర‌భుత్వ హయాంలో వేధింపుల‌వ‌ల్ల‌నే త‌న ఆరోగ్యం బాగా దెబ్బ‌తిన్న‌దని బీజేపీ నాయ‌కురాలు, భోపాల్ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. కాంగ్రెస్ త‌న‌పై త‌ప్పుడు కేసులు పెట్టించి పోలీసుల ద్వారా వేధింపుల‌కు పాల్ప‌డింద‌ని ఆమె విమ‌ర్శించారు. కాంగ్రెస్ వేధింపుల కార‌ణంగా తాను కంటి చూపు కూడా కోల్పోయానని ఆమె తెలిపారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బీజేపీ ప్రధాన కార్యాలయంలో  జరిగిన యోగా కార్యక్రమంలో ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ పాల్గొన్న సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కంటి రెటీనా నుంచి మెదడు వరకు వాపు, రసి ఉన్నాయని, ఒక కంటికి దృష్టి పోయిందని చెప్పారు. 

కుడి కన్ను మసక మసకగా కనిపిస్తున్న‌దని, ఎడమ కన్ను దృష్టి పూర్తిగా పోయిందని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో తొమ్మిదేండ్ల‌పాటు తాను వేధింపుల‌కు గుర‌య్యాన‌ని ప్ర‌జ్ఞ‌ విమర్శించారు. 2008నాటి మాలెగావ్ పేలుళ్ళ కేసులో ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌ను కాంగ్రెస్ ప్ర‌భుత్వం జైలులో పెట్టించింది.

కాగా, ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ కనిపించడం లేదంటూ ఇటీవల భోపాల్‌లో పోస్టర్లు వెలిసిన విషయాన్ని విలేకర్లు ప్రస్తావించ‌గా తాను లాక్‌డౌన్ వల్ల ప్రయాణాలపై ఆంక్షలు ఉండ‌టంతో ఢిల్లీ నుంచి భోపాల్‌కు రాలేకపోయానని ఆమె చెప్పారు.