మయన్మార్ లో రహస్యంగా చైనా మెగా నగరం 

చైనా విస్తరణ వాదానికి మయన్మార్ లో కేవలం 60 విల్లాల నిర్మాణం కోసం కొద్దిపాటి స్థలం తీసుకొని, రహస్యంగా నాలుగు లక్షల మంది తమ ప్రజలు నివాసం ఉండే విధంగా ఒక ఆధునిక మహానగరం నిర్మాణం పనులు చేపట్టడం ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తుంది. థాయిలాండ్, మయన్మార్ లను విడదీస్తున్న మోయి నాదీ తీరంలో 15 బిలియన్ డాలర్ల వ్యవయంతో శ్వేకొక్కో నగరం చైనా నిర్మిస్తున్నట్లు తెలిసి మయన్మార్ ఫెడరల్ ప్రభుత్వం దిగ్బ్రాంతి చెందింది.

ఈ ప్రాజెక్ట్ గురించి తమకేమి తెలియదని మయన్మార్ అధికారులు వాపోతున్నారు. 2018 మధ్యలో చైనాకు చెందిన రెండు కంపెనీలతో జాయింట్ వెంచర్ ప్రారంభించి కేవలం 25 ఎకరాల స్థలంలో 22.5 మిలియన్ డాలర్లతో 60 విల్లాలు నిర్మించడానికి మయాన్మార్ యాతాయి ఇంటర్నేషనల్ హోల్డింగ్ గ్రూప్ కు అనుమతి ఇచ్చారు.

అయితే ఈ ప్రాజెక్ట్ పై వారు 2017లోనే పనులు ప్రారంభించారు. కొద్దీ నెలలోనే భారీగా  భూములను చైనా వారు స్వాధీనం చేసుకొని నిర్మాణాలు ప్రారంభించారు. విల్లాలతో పాటు మెగా షాపింగ్ మాల్స్, అంతర్జాతీయ విమానాశ్రయం, రహదారులు, ఇతర సదుపాయాల నిర్మాణం  73,000 హెక్టార్ల స్థలంలో చేపట్టారు. 

మయన్మార్ స్థానిక పత్రికలలో ఈ విషయమై కధనాలు రావడంతో గత ఏడాది దేశంలో తీవ్రమైన ప్రజా నిరసన వ్యక్తమైనది. దీనిపై ఫెడరల్ ప్రభుత్వం దర్యాప్తు జరిపిస్తున్నా చైనా వారు ముడుపులతో అందరిని కొనివేయగల సమర్థులనే భావన వ్యక్తమవుతున్నది. 

వస్తున్న కధనం పప్రకారం దేశ సరిహద్దులో ఉన్న కాయిన్ రాష్ట్రాల్లోని స్థానిక అధికారులకు చైనా వారు భారీ  ముడుపులు చెల్లించి మెగా నగరం నిర్మింప గలుగుతున్నారు. మయాన్మార్ లోని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక్ ది ఇర్రవాడే కధనం ప్రకారం మొదటగా కేవలం 22.5 మిలియన్ డాలర్ల వ్యయంతో 59 విల్లాల నిర్మాణానికి  25.5 ఎకరాలను సేకరించడానికి మయాన్మార్ ఇన్వెస్ట్మెంట్ కమీషన్ ఆమోదించింది. 

కానీ ఈ ప్రాజెక్ట్ కు 214 ఎకరాలు అవసరమని మయాన్మార్ యాతల్ ప్రకటించింది. కొద్దీ నెలల తర్వాత ఈ ప్రాజెక్ట్ విస్తీర్ణనాన్ని 29,652.6 ఎకరాలకు విస్తరించినట్లు జిలిన్ యాతాయి గ్రూప్ ఏకపక్షంగా ప్రకటించింది. అందుకు 500 మిలియన్ డాలర్ల వ్యయం అవుతుందని, అందులో విల్లాలతో పాటు హోటళ్లు, కేసినోలు, విమానాశ్రయం కూడా ఉంటాయని తెలిపింది. 

ఫెడరల్  ప్రభుత్వం అనుమతి లేకుండా స్థానిక అధికారులు, రాజకీయ నేతలకు భారీగా ముడుపులు చెల్లించినట్లు మీడియా వెల్లడించింది. కాయిన్ రాష్ట్ర ప్రభుత్వం మొదట్లో కేవలం  68 ఎకరాలను మాత్రమే బాడుగకు ఇచ్చింది. స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని పేరుతో స్థానికుల నుండి స్థలాలు సేకరించారు. కానీ స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా థాయిలాండ్ ద్వారా చైనా నుండి భారీ సంఖ్యలో వేలకొద్దీ  కార్మికులను తీసుకు వచ్చి పనులు చేస్తున్నారు. 

మయాన్మార్ యాతాయి ఇంటర్నేషనల్ హోల్డింగ్ గ్రూప్  ను ఆ సంవత్సరం  ఫిబ్రవరిలో మాత్రమే నమోదు చేసి, చైనా ప్రభుత్వ నియంత్రణలో గల చైనా ఫెడరేషన్ అఫ్ ఓవర్సీస్  చైనీస్ ఎంట్రెప్రినేటర్స్ ద్వారా చైనా కంపెనీ కల్నల్ చిట్ తు తో  భాగస్వామ్య ఒప్పందం చేయించారు.

జిలిన్ యాతాయి గ్రూప్ నమోదు చేసుకొని, భాగస్వామ్య ఒప్పందంతో ప్రాజెక్ట్ పని ప్రారంభించింది. మొదట కేవలం 10.3 హెక్టార్లలో 60 విలాసవంత విల్లాలను 22.5 మిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించడం కోసం మాత్రమే అనుమతి జులై, 2018లో తీసుకున్నారు. కానీ అప్పటికే  పూర్తిస్థాయి మెగా నగరం నిర్మించడానికి సన్నాహాలు ప్రారంభించారు. 

ఈ ప్రాజెక్ట్ 1.80 లక్షల ఎకరాలలో 15 బిలియన్ డాలర్ల  వ్యయంతో చేపట్టిన్నట్లు ఫ్రాంటియర్ మయాన్మార్ పత్రిక పేర్కొన్నది. విలాసవంతమైన విల్లాలతో పాటు 1,200 గదుల హోటల్, క్యాసినోలు, వినోద కంప్లెక్స్, సూపర్ మార్కెట్ లు, డిపార్ట్మెంటల్ స్టోర్లు, పోలీస్ స్టేషన్, పారిశ్రామిక్ జోన్ వంటి వాటిని ఇక్కడ నిర్మిస్తున్నారు. దీని నిర్మాణం 2027కి పూర్తవుతుందని భావిస్తున్నారు. 

ఈ ప్రాజెక్ట్ ఫెడరల్ ప్రభుత్వం పరిధిలోనిది కాబట్టి తాము పట్టించుకోలేదని స్థానిక ప్రభుత్వం చెబుతున్నది. అయితే స్థానిక ప్రభుత్వమే కొన్ని అనుమతులు ఇవ్వడంతో వారే పర్యవేక్షించాలని ఫెడరల్ ప్రభుత్వం స్పష్టం చేస్తున్నది. చైనా జాతీయులే మలేసియా, కంబిడియా పౌరసత్వాలను అక్రమంగానో, ఇతరత్రానో సంపాదించి మయాన్మార్ యాతాయి లో 80 శాతం వాటాదారులుగా చేరారు. మిగిలిన 20 శాతం కల్నల్ చిట్ తు కు ఉంది. 

ఈ ప్రాంతం భద్రతా రీత్యా కీలకమైనది కావడంతో చైనా కన్ను వేసిన్నట్లు తెలుస్తున్నది.  థాయిలాండ్ కు ప్రవేశద్వారం అయిన మాయావడ్డికి 15 కిమీ దూరంలో, ఆసియా రహదారికి దగ్గరలో ఉంది. దానితో భారత్ – అగ్నేసియా మధ్య ప్రధాన వాణిజ్య రహదారిగా ఆవిర్భవింపనున్న ఈ మార్గంలో చైనా నియంత్రణకు వీలు ఏర్పడుతుంది. 

ఆసియా, ఆఫ్రికాలలో చైనా నిర్మిస్తున్న పలు నగరాల వలే ఈ నగరంకు కూడా చైనా ప్రజా సైన్యం భద్రత కల్పిస్తుంది. ఇప్పటికే చైనా భద్రతా దళాలు  బైటవారి ప్రవేశాన్ని నియంత్రిస్తున్నాయి. మయన్మార్ అధికారులు సహితం అనుమతి లేనిదే ప్రవేశించడానికి వీల్లేదు. 

జిలిన్ యాతాయి చైనాకు చెందిన ప్రైవేట్ కంపెనీ అని చెబుతున్నప్పటికీ చైనా కమ్యూనిస్ట్ పార్టీ, ప్రజా సైన్యంలోని ఉన్నత వర్గాలు దానిలో భాగస్వాములనే అనుమానాలు చెలరేగుతున్నాయి. 

(స్వరాజ్ నుండి)