5వేల కోట్లతో 33 ఫైటర్‌ జెట్స్‌ కొనుగోలు

చైనాతో ఉద్రిక్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.5 వేల కోట్లతో సుఖోయ్, మిగ్ -29 యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 12 సుఖోయ్, 21 ‘మిగ్ -29’ ఫైటర్ క్రాఫ్ట్​లను వీలైనంత త్వరగా కొనాలంటూ రక్షణ శాఖ నుంచి వైమానిక దళానికి ఆదేశాలు అందాయి. 

ఇందుకు సంబంధించిన పక్రియ ఇప్పటికే మొదలైనట్లు తెలుస్తున్నది. దాదాపు వారం పది రోజుల్లోనే మొత్తం వ్యవహారాన్ని పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. వీటితోపాటు మన దగ్గర ఉన్న ఫైటర్ ఫ్లైట్స్ కు కావాల్సిన పరికరాలను కూడా కొనేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

లడఖ్ లోని గల్వాన్ లోయలో జరిగిన గొడవలో 20 మంది మన సైనికులు చనిపోవడంతో కేంద్రం అప్రమత్తమైనది. రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితి ఎదురైనా సిద్ధంగా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. చైనా వ్యవహారంలో కఠినంగానే ఉండాలని భావిస్తోంది.

ఇప్పటికే త్రివిధ దళాలను కూడా అప్రమత్తం చేశారు. మరోవైపు నాలుగేళ్ల క్రితమే ఫ్రాన్స్ నుంచి 36 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు మనదేశం ఒప్పందం చేసుకుంది. అయితే అవి రావటానికి ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో సుఖోయ్, మిగ్ -29 విమానాలను కొనాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. రాఫెల్ ఒప్పందం తర్వాత ఇదే పెద్ద డీల్.

ఇలా ఉండగా,  చైనా సైనికులతో సోమవారం రాత్రి జరిగిన గొడవలో భారత సైనికులు కొందరు కనిపించడం లేడనై వస్తున్న కథనాలను సైనిక వర్గాలు కొట్టిపారేశాయి. ఒక్క సైనికుడు కూడా తప్పిపోలేదని కాలేదని స్పష్టం చేశాయి. ఘర్షణ జరిగిన సమయంలో అక్కడ ఉన్నసైనికులు అంతా వెనక్కి వచ్చారని చెప్పాయి.