పూరీలో రధయాత్రపై సుప్రీం కోర్ట్ స్టే

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఒడిశాలో ప్రతి ఏడాది నిర్వహించే జగన్నాధుని రధయాత్ర, అనుబంద కార్యకపాలపై గురువారం సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ యాత్ర జూన్‌ 23న జరగాల్సి వుంది. ప్రతి యేడు 12 రోజుల పాటు జరిగే ఈ యాత్రకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారన్న విషయం తెలిసిందే. 

అయితే ప్రజల భద్రత, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఈ ఏడాది రధయాత్రను నిలిపివేయాలని సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఎ.బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. ఈ వేడుకపై నిషేధాన్ని విధించవద్దని, బదులుగా తక్కువ మంది ప్రజలను అనుమతించడం ద్వారా వేడుకలు జరిపేందుకు అనుమతించాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టును కోరారు.

ఏదైనా మతపరమైన కార్యకలాపాలకు అనుమతిస్తే అధిక సంఖ్యలో ప్రజలు హాజరవుతారన్న విషయం మాకు అనుభవ పూర్వకంగా తెలుసునని, ఈ విషయంలో జగన్నాధుడు మమ్మల్ని క్షమిస్తాడని బాబ్డే వ్యాఖ్యానించారు.

కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తున్న సమయంలో రధయాత్ర నిర్వహిస్తే వ్యాధి తీవ్రత అధికంగా ఉంటుందంటూ ఒడిశా వికాష్‌ పరిషద్‌ అనే స్వచ్చంధ సంస్థ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ యాత్రలో వేలాది మంది ప్రజలు పాల్గంటారని, దీంతో భౌతిక దూరాన్ని పాటించడం సాధ్యం కాదని పిటిషన్‌లో పేర్కొన్నారు.