నౌగాం సెక్టార్‌లో పాక్ కవ్వింపు కాల్పులు  

ఒక వంక సరిహద్దుల్లో చైనా ఘర్షణలకు తలబడుతుండగా, మరోవంక పాకిస్తాన్‌ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్‌ ఉల్లంఘిస్తోంది. భారత సైనిక స్థావరాలను, సరిహద్దు గ్రామాల ప్రజలను లక్ష్యంగా చేసుకుని పాక్‌ రేంజర్లు కాల్పులకు తెగబడుతున్నారు.

సరిహద్దులోని నియంత్రణ రేఖ వద్ద నౌగాం సెక్టార్‌లో బుధవారం ఉదయం పాకిస్తాన్‌ రేంజర్లు కాల్పులకు పాల్పడ్డారు. మోర్టార్‌ షెల్స్‌తో దాడి చేశారు. పాక్‌ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. సరిహద్దు గ్రామాల ప్రజలు మాత్రం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు.

తంగధర్‌ సెక్టార్‌లో నిన్న భారీ ఆయుధాలతో పాక్‌ కాల్పులకు పాల్పడింది. గత కొద్ది రోజుల నుంచి పాక్‌.. భారత సైనిక శిబిరాలను, సరిహద్దు గ్రామాల ప్రజలను టార్గెట్‌ చేసింది. 

ఈ ఏడాది మొదట్నుంచి ఇప్పటి వరకు దాదాపు 2 వేల సార్లకు పైగా పాకిస్తాన్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు ఇటీవలే కేంద్ర రక్షణ శాఖ వెల్లడించింది. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత పాకిస్తాన్‌.. ఈ చర్యలను మరింత తీవ్రం చేసినట్లు పేర్కొంది.