దక్షిణ కశ్మీర్‌ లో ఉగ్రవాదుల ఏరివేత పూర్తి

దక్షిణ కశ్మీర్‌లో మాటువేసిన ఉగ్రవాదులందరిని దాదాపుగా తుడిచిపెట్టినట్లు జమ్ముకశ్మీర్‌ పోలీసులు నేడు ప్రకటించారు. ‌ దక్షిణ కశ్మీర్‌లో ఉగ్రవాదం దాదాపుగా అంతమైందని కశ్మీర్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌(ఐజీపీ) విజయ్‌ కుమార్ వెల్లడించారు.

ఇకపై తమ దృష్టినంతా ఈశాన్య కశ్మీర్‌పై కేంద్రీకరించనున్నట్లు తెలిపారు. వచ్చే నెలలో ఈశాన్య కశ్మీర్‌లో తమ ఆపరేషన్‌ను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 25 ఏకే-47 ఆయుధాలను  స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 

కశ్మీర్‌ పండిట్‌ సర్పంచ్‌ను హిజ్బూల్‌ మూజాహిద్దీన్‌కు చెందిన ఉగ్రవాదులు కాల్చి చంపిన ఘటనలో ఉమర్‌ అనే ఉగ్రవాదితో పాటు మరో ఉగ్రవాది ఈ హత్య ఘటనలో పాల్గొన్నట్లు సమాచారం అందిన్నట్లు చెప్పారు.

కుప్వారాలో ఇటీవల పెద్ద ఎత్తున డ్రగ్స్‌ రాకెట్‌ను పట్టుకున్నట్లు తెలిపారు. నార్కో మాడ్యుల్‌ ద్వారా ఉగ్రవాదులకు రూ. 3.5 కోట్ల నగదు పంపిణీ జరిగిందని చెప్పారు. ఈ కేసులో త్వరలోనే మరిన్ని అరెస్టులు చోటుచేసుకోనున్నట్లు వెల్లడించారు. డ్రగ్స్‌ రాకెట్‌లో ప్రధాన సూత్రధారినితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. 

రూ. 5 కోట్ల విలువైన నార్కో మెటిరియల్‌ను అమృత్‌సర్‌లో విక్రయించారు. ఈ నగదులో రూ.3.5 కోట్లను ఉగ్రవాదులకు అందజేశారని పేర్కొన్నారు. కశ్మీర్‌లోని ఉగ్రవాదానికి డ్రగ్స్‌ ప్రధాన ఆదాయ వనరుగా ఉందని, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ డ్రగ్స్‌ను విక్రయిస్తున్నట్లు తెలిపారు.