భారత్ హెచ్చరికతో దిగివచ్చిన పాక్ 

పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగుల అదృశ్యం ఎట్టకేలకు సోమవారం రాత్రికి తెరవీడింది. భారత ప్రభుత్వ హెచ్చరికతో వారిని విడుదల చేశారు.  రోడ్డు ప్రమాదానికి కారణమై, పారిపోయిన ఆరోపణల మీద వారిని పోలీసులు  అరెస్టు చేసినట్టు తెలిపారు. 

అయితే, ఈ ఘటనపై భారత్‌ మండిపడింది. తమ ఉద్యోగులను విడుదల చేయాలని తీవ్రంగా హెచ్చరించింది. దీంతో వెనక్కి తగ్గిన పాకిస్తాన్ ప్రభుత్వం  ఉద్యోగులను పది గంటల తర్వాత విడుదల చేసింది. సోమవారం ఉదయం రోడ్డు దాటుతున్న ఓ పాదచారున్ని భారత హైకమిషన్‌కు చెందిన కారు ఒకటి ఢీకొట్టిందని, కారులోని ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారని పాక్‌ మీడియా సంస్థ జియో న్యూస్‌ వెల్లడించింది.

ఈ ఘటనపై భారత్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ ఉద్యోగులను వెంటనే విడుదల చేయాలని భారత్‌లో పాకిస్థాన్‌ హై కమిషనర్‌ సయ్యద్‌ హైదర్‌ షాకి సమన్లు పంపించింది. 

పాక్‌ అధికారుల వైఖరిపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తూ తీవ్ర హెచ్చరికలతో ఓ నోటీసును కూడా జారీ చేసింది. దీంతో పాక్‌ వెనక్కి తగ్గింది. అరస్టైన భార త ఉద్యోగులను అధికారిక కారుతో సహా వెంటనే విడిచిపెట్టాలని పోలీసులను  ఆదేశించింది.

కాగా భారత ఉద్యోగులను పాక్‌ అక్కసుతోనే అరెస్టు చేసినట్టు తెలుస్తున్నది. ఢిల్లీలోని పాక్‌ హైకమిషన్‌లో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు గూఢచర్యానికి పాల్పడ్డారని పేర్కొంటూ రెండు వారాల క్రితం భారత్‌ వారిని పాకిస్థాన్‌కు పంపించింది. ఆ అక్కసుతోనే భారతీయ ఉద్యోగులపై పాక్‌ వేధింపు చర్యలకు పాల్పడుతున్నట్టు అధికారులు భావిస్తున్నారు.