తెలంగాణ విద్యుత్ బిల్లులపై రేపు బిజెపి ధర్నాలు 

ప్రజలపై తెలంగాణ ప్రభుత్వం అడ్డగోలుగా విద్యుత్‌ బిల్లుల భారం మోపడాన్ని నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర కమిటీ ఆందోళనకు పిలుపునిచ్చింది. అధిక బిల్లులను రద్దు కు ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు బిజెపి డిమాండ్ పరిష్కరించేవరకు ధర్నా నిరవధికంగా కొనసాగుతుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్ కుమార్ ప్రకటించారు.  
 
సోమవారం హైదరాబాద్‌లోని విద్యుత్‌ సౌధ, అన్ని జిల్లా కేంద్రాల ఎదుట ధర్నాలు చేపట్టాలని సంజయ్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. విద్యుత్‌ సౌధ ముందు నిర్వహించే ఆందోళనలో తనతో పాటు రాష్ట్ర కోర్‌ కమిటీ సభ్యులు పాల్గొంటారని  తెలిపారు.  జిల్లాల్లో జరిగే ధర్నాలో జిల్లా అధ్యక్షులు, ఆయా జిల్లా కోర్‌ కమిటీ సభ్యులు పాల్గొంటారని వెల్లడించారు.
 
 లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూ శాంతియుతంగా నిరసన తెలపనున్నట్టు బండి సంజయ్‌ కుమార్ పేర్కొన్నారు. సోమవారం ధర్నాలో కార్యకర్తలు ఎవరూ పాల్గొనవద్దని సూచించారు. ప్రభుత్వ అసంబద్ధ విధానాలతోనే ప్రజలపై భారం మోపడం సమంజసం కాదని మండిపడ్డారు. 
 
సాంకేతిక కారణాలు, స్లాబ్‌లను సాకులుగా చూపుతూ ప్రభుత్వం జనం జేబులకు చిల్లులు పెట్టడం మానుకోవాలని సంజయ్‌ డిమాండ్‌ చేశారు. పేద, మధ్యతరగతి, ఉద్యోగస్తుల తోపాటు అందరిపై కేసీఆర్‌ సర్కారు దోపిడీ మానుకోవాలని ధ్వజమెత్తారు. ప్రజలపై పడిన అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించి, వినియోగదారులకు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. 
 
లాక్‌డౌన్‌ సమయంలో పనులు లేక, కిరాయిలు చెల్లించకపోవడంతో కార్మికులు, యజమానులు అందరూ నష్టపోయారని సంజయ్‌ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్న ప్రజలందరి పై మరింత భారం మోపడం దారుణమని దయ్యబట్టారు. అధిక బిల్లుల రద్దు కు ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు బిజెపి డిమాండ్ లు పరిష్కరించేవరకు ధర్నా నిరవధికంగా కొనసాగుతుందని స్పష్టంచేశారు.