మహానదిలో 500 ఏళ్ళనాటి పురాతన ఆలయం 

ఒడిశా రాష్ట్రంలో సుమారు 500 ఏండ్ల కింద నీట మునిగిన ఓ పురాతన గుడి ఇప్పుడు బయటపడింది. కటక్‌లోని మహానంది నదీ తీరంలో మునిగిపోయిన పురాతన ఆలయాన్ని ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్‌కు చెందిన పురావస్తు సర్వే బృందం ఇటీవల కనుగొన్నది.  
పడవలో నది అంతా గాలిస్తూ పలు ప్రయత్నాల తర్వాత దీనిని గుర్తించినట్లు ఆ బృందానికి చెందిన దీపక్‌ కుమార్ నాయక్‌ తెలిపారు. కటక్‌ సమీపంలోని పద్మావతి ప్రాంతంలో బైదేశ్వర్‌ వద్ద నది మధ్యలో మునిగిన ఈ ఆలయ శిఖరాన్ని కనుగొన్నట్లు ఆయన చెప్పారు.
60 అడుగుల ఎత్తున్న ఈ ఆలయ నిర్మాణ శైలి, నిర్మాణంలో వాడిన మెటీరియల్‌ను బట్టి ఈ ఆలయం 15వ లేదా 16వ శతాబ్ధం నాటిదని భావిస్తున్నారు. విష్ణు స్వరూపమైన  గోపీనాథ్‌ దేవ్‌కు చెందిన 60 అడుగుల ఎత్తైన ఈ ఆలయం అత్యంత పురాతనమైనదని పురావస్తు శాస్త్రవేత్త దీపక్‌ కుమార్‌ వెల్లడించారు.
ఈ ఆలయం కనుగొన్న ప్రాంతం పద్మావతి గ్రామం ఏడు గ్రామాల కలయికగా ఆవిర్భవించిన సతపట్టణగా గుర్తింపుపొందింది. 150 ఏళ్ల కిందట భారీ వరదలు పోటెత్తడంతో మహానది ఉప్పొంగడంతో మొత్తం గ్రామం నీటమునిగింది. ఈ ప్రాంతంలో దాదాపు 22 దేవాలయాలు వరదలతో నీటమునిగాయని అత్యంత పొడవైన గోపీనాథ్‌ దేవాలయం శిఖరం మాత్రమే కొన్నేళ్ల పాటు కనిపించిందని పద్మావతి గ్రామస్తులు చెబుతున్నారు.

స్ధానికుడు రవీంద్ర రాణా సహకారంతో దీపక్‌ నాయక్‌ ఈ పురాతన ఆలయాన్ని గుర్తించారు. 11 ఏళ్ల కిందట వేసవిలో చివరిసారిగా ఈ ఆలయ శిఖరం స్ధానికులకు కనిపించిందని చెబుతారు. గత ఏడాదిలో నీటి ఉధృతి తగ్గిన నాలుగైదు రోజులు ఆలయ ఆనవాళ్లు కనిపించాయని రవీంద్ర రాణా తెలిపారు. 

మహానది నీటి గర్భంలో ఆలయం ఉందని ప్రజలకు తెలిసినా 25 సంవత్సరాలుగా అది బయటపడలేదని మహానది ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ అనిల్‌ ధీర్‌ చెప్పారు. మహానదిలో పురాతన ఆలయాన్ని గుర్తించామని ఈ ఆలయాన్ని చూసేందుకు ప్రజలు నదిలోకి వెళ్లవద్దని తాము గ్రామస్తులను కోరామని నయాగఢ్‌ సబ్‌ కలెకట్ర్‌ లగ్నజిత్‌ రౌత్‌ పేర్కొన్నారు.