స్వదేశీ నినాదం ఊపందుకోవాలి

స్వదేశీ నినాదం ఊపందుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపిచ్చారు. భారతీయులు భారతీయ ఉత్పత్తులను మాత్రమే వాడాలని కోరారు.   ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 95వ వార్షికోత్సవం  ఉద్దేశించి మాట్లాడుతూ  స్వామి వివేకానంద ఈ విషయాన్ని ఎప్పుడో చెప్పారని గుర్తు చేశారు. దేశం తన కాళ్లపై తాను నిలబడాలని పేర్కొన్నారు. 

బలమైన స్వదేశీ సరఫరా విధానాన్ని తయారు చేసేందుకు ఇది అనుకూలమైన సమయమని చెబుతూ   భారత ఎగుమతులపై చాలా దేశాలు ఆధారపడినట్లు ప్రధాని మోదీ తెలిపారు.   కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ పద్ధతి నుంచి భారత ఆర్థిక వ్యవస్థను తప్పించాలని, దాన్ని ప్లగ్‌ అండ్‌ ప్లే దిశగా తీసుకువెళ్లాలని సూచించారు. 

సంకుచిత విధానాలకు ఇది సమయం కాదని చెబుతూ సాహసోపేత నిర్ణయాలకు,పెట్టుబడులకు ఇదే అదునైన సమయం చెప్పారు. కరోనా ప్రభావం అన్ని రంగాలపై పడిందని పేర్కొంటూ గత నెలలోనే రెండు తుఫాన్లు వచ్చాయి,  ఉత్తరాదిలో మిడతల దండు ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపారు. అయితే  ప్రజల మద్ధతుతో అన్ని సమస్యలను ఎదుర్కొంటున్నామని భరోసా వ్యక్తం చేశారు.

దేశంలోని ప్రతి పౌరుడు .. సంక్షోభాన్ని ఓ అవకాశంగా మార్చుకునేందుకు నడుం బిగించారని ప్రధాని సంతోషం ప్రకటించారు. ఈ అవకాశాన్నే ఓ మలుపు‌గా మార్చుకోవాలని సూచించారు. దాంతోనే స్వయం సమృద్ధి భారత్‌గా ఎదగాలని చెప్పారు.

”చిన్న పరిశ్రమలకు సాయంగా వేల కోట్లు కేటాయించాం. పరిశ్రమల రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. దేశంలో ఉద్యోగ అవకాశాలు పెరిగిపోతున్నాయి.రైతులు దేశంలో తమ పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చు. రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వేస్తున్నాం’ అని మోడీ వివరించారు.  

“ఇది పరీక్షా కాలం. మనం ఓటమిని ఒప్పుకోవద్దు.. నిరంతరం గెలుపుకోసం ప్రయత్నించాలి. సవాళ్ళను ఎదుర్కొన్నవారే విజేతలవుతారు. ఐకమత్యమే మన బలం”అంటూ ప్రధాని చెప్పారు. సమస్యలు వచ్చినపుుడు భయపడితే ముందుకెళ్లలేమని స్పష్టం చేశారు. విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ధైర్యంగా ముందుకెళ్లాల్సిందే అని ప్రోత్సహిచారు. 

”ప్రపంచమంతా కోవిడ్ పై పోరాడుతోంది. దేశం తన కాళ్లపై తాను నిలబడాలి. అందుకే మనం ఆత్మ నిర్భర్ కార్యక్రమాన్ని ఎంచుకున్నాం. విదేశాలపై ఆధారపడటం తగ్గించుకునేందుకే ఆత్మ నిర్భర్ భారత్. స్వదేశీ నినాదం ఊపందుకోవాలి” అని వివరించారు.