గల్ఫ్ లో చిక్కుకున్న తెలంగాణవాసులను తరలించాలి

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో గల్ఫ్ లో చిక్కుకుపోయిన తెలంగాణ కార్మికులను స్వదేశానికి తరలించాలని కోరుతూ కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వి.మురళీథరన్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డిలకు బిజెపి తెలంగాణ అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ లేఖ రాశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ‘వందేభారత్ మిషన్’ కార్యక్రమంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా అనేక మంది తెలంగాణవాసులను సైతం స్వదేశానికి తరలించారు.

అయితే గల్ఫ్ దేశాల్లో సుమారు 10 లక్షల మంది తెలంగాణవాసులు పని చేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వీరిలో బతుకు తెరువు కోసం వలస వెళ్లినవారే ఎక్కువగా ఉన్నారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వీరు స్వదేశానికి రాలేక గల్ఫ్ లోనే చిక్కుకుపోయి దీనావస్థలో కొనుసాగుతున్నారని పేర్కొన్నారు.

దీంతో ఇక్కడ స్వదేశంలో ఉంటోన్న వారి కుటుంబీకుల్లోనూ తీవ్ర ఆందోళన నెలకొంది. వారి దుర్భర స్థితికి చలించిపోయిన సంజయ్ కుమార్ ‘వందేభారత్ మిషన్’లో భాగంగా తక్షణమే మస్కట్ నుంచి హైదరాబాద్ కు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసి, గల్ఫ్ లో చిక్కుకుపోయిన తెలంగాణవాసులను స్వదేశానికి తరలించేందుకు సహకరించాలని కోరుతూ కేంద్ర మంత్రులకు ఈమెయిల్ ద్వారా లేఖ పంపించారు.