రాహుల్ పై మండిపడ్డ అబ్బాస్ నఖ్వీ 

లాక్‌డౌన్ విఫలమైనదని విమర్శించిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ మండిపడ్డారు. పరిష్కారంలో భాగమవ్వాలని, రాజకీయ అంతరాయంలో కాదని హితవు చెప్పారు.  కరోనాపై పోరాటంలో కాంగ్రెస్ తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని, అయోమయాన్ని సృష్టిస్తోందని నఖ్వీ ధ్వజమెత్తారు. 
 
కాంగ్రెస్ పార్టీ రాజకీయ కాలుష్యాన్ని వ్యాప్తి చేయాలనుకుంటోందని దుయ్యబట్టారు. కరోనా ‘మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత సమయంలో రాజకీయ కాలుష్యాన్ని తయారు చేసే ప్రయోగశాలగా కాంగ్రెస్ పార్టీ తయారైందని పేర్కొన్నారు.
 “మీరు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. కరోనాపై పరిష్కారంలో భాగమవ్వాలని కాకుండా రాజకీయ కాలుష్యాన్ని వ్యాప్తి చేయాలని మాత్రమే వాళ్లు అనుకుంటున్నారు. మేం లాక్‌డౌన్ నిర్ణయం తీసుకున్నప్పుడు.. లాక్‌డౌన్ ఎందుకని మీరు  ప్రశ్నించారు. ఇప్పుడు లాక్‌డౌన్ ఎత్తేయడం కరెక్ట్ కాదని అంటున్నారు” అంటూ కాంగ్రెస్ వారిపై విమర్శలు కురిపించారు.
సమస్య ఏంటంటే వారికి దేనిపైనా సరైన అవగాహన లేదని ధ్వజమెత్తారు. అయినా సరే తమను తాము అన్నీ తెలిసిన నిపుణులమని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. “పరిష్కారంలో భాగమవ్వండి.. రాజకీయ అంతరాయంలో కాదు”అంటూ హితవు చెప్పారు.