గాంధీ ఆస్పత్రిలో ఏం జరుగుతోంది?

తెలంగాణ ప్రభుత్వం కరోనా ఆసుపత్రిగా ప్రకటించిన గాంధీ ఆస్పత్రిలో అసలు ఏం జరుగుతున్నదని బిజెపి ఎమ్యెల్యే రాజాసింగ్ నిలదీశారు. కరోనా నియంత్రణకు కేసీఆర్ ప్రభుత్వం  ఏం చేస్తోంది? అని ప్రశ్నించారు.

ధూల్‌పేట్‌కు చెందిన ఓ ఏడునెలల గర్భిణి కొవిడ్‌ పాజిటివ్‌తో బాధపడుతోందని, వెంటనే మెరుగైన వైద్యం అందించాలని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు తాను విన్నవించినా వినిపించుకోలేదని, ఈలోగా తల్లితోపాటు కడుపులో ఉన్న శిశువు కూడా చనిపోవడం దారుణమని ‌ ఆవేదన వ్యక్తం చేశారు.

ధూల్‌పేట్‌కు చెందిన ఓ వృద్ధుడు గత కొద్ది రోజుల క్రితం ఆనారోగ్యంతో చనిపోయాడు. ఆయనకు కరోనా పాజిటివ్‌ ఉందని ఎవరికీ తెలియదు. తండ్రి అంత్యక్రియలకు వెళ్లిన గర్భిణితోపాటు కుటుంబ సభ్యులకూ కొవిడ్‌ సోకింది. ఆ గర్భిణి వెంటనే 1న వైద్య పరీక్షల నిమిత్తం గాంధీలో అడ్మిట్‌ అయింది.ఆమెతో పాటు కడుపులో ఉన్న శిశువు కూడా మృతి చెందిందని గుర్తు చేశారు.

గర్భిణికి మెరుగైన వైద్యం చేయాలని సూపరింటెండెంట్‌ రాజారావుకు తాను ఫోన్‌ చేసి విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని రాజాసింగ్‌ వాపోయారు.

‘ఒక గర్భిణికి కరోనా సోకి గాంధీ ఆసుపత్రిలో చేరితే అక్కడి వైద్యులు, సిబ్బంది పట్టించుకోలేదు. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెండ్‌కు ఫోన్‌చేసి చెప్పినా సరిగా స్పందించలేదు. మంత్రి కేటీఆర్‌కు పదిసార్లు ఫోన్‌చేశా. ట్విటర్‌లో నివేదించా. మంత్రి ఈటలకు ఫోన్‌ చేసినా స్పందించలేదు’ అంటూ చెప్పుకొచ్చారు.

ఒక ఎమ్మెల్యేగా ఫోన్‌కే స్పందించకపోతే ఇక సామాన్యులకు దిక్కెవరు? చివరకు ఆ గర్భిణి బుధవారం రాత్రి చనిపోయింది, ఆస్పత్రిలో కొవిడ్‌తో చికి త్స పొందుతున్న పాజిటివ్‌ రోగుల పరిస్ధితి ఏమిటి?, అంటూ రాజాసింగ్ ప్రశ్నించారు. సూపరింటెండెంట్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, గర్భిణి మృతిపై సీఎం కేసీఆర్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.